Sunday, March 9, 2025

అపర అన్నమయ్య ఇకలేరు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ మృతి

 


నమస్తే తెలంగాణ

అపర అన్నమయ్య ఇకలేరు

గుండెపోటుతో గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ మృతి

వెయ్యికిపైగా అన్నమయ్య కీర్తనలకు స్వరకల్పన

టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా సుదీర్ఘకాలం సేవలు

ఇటీవల యాదగిరిగుట్ట ఆలయంలోనే ఆఖరి ప్రదర్శన

నేపథ్య గాయని ఎస్ జానకికి బాలకృష్ణప్రసాద్ మేనల్లుడు

హైదరాబాద్, తెలుగు యూనివర్సిటీ, మార్చి 9: తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడు, సంగీత స్వరకర్త,

శాస్త్రీయ సంగీత గాయకుడు, కళారత్న గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ (76) కన్నుమూశారు. తిరుమలలోని తన స్వగృహంలో గుండెపోటు రావడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. వెయ్యికిపైగా అన్నమయ్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన గరిమెళ్ల.. ప్రముఖ సంగీత విద్యాంసుడిగా పేరొందారు. ఆయన స్వరకల్పన చేసిన 'వినరోభాగ్యము విష్ణుకథ', 'పిడికిట తలంబ్రాల

పెండ్లి కూతురు', 'జగడపు చనువుల జాజర`.. తదితర సంకీర్తనలు ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. వచ్చెను అలిమేలు మంగ, తిరువీధుల మెరసీ దేవదేవుడు, చూడరమ్మ సతులారా, జయలక్ష్మి వరలక్ష్మి,

ఆదిమూలమే మాకు అంగరక్ష,అంతయు నీవే హరి,

ఏమని పొగడుదుమే తదితర కీర్తనలు కూడా ఆయన స్వరపరిచినవే. సంప్రదాయ కర్ణాటక, లలిత, జానపద సంగీతంలోనూ ఆయన ప్రసిద్ధులు. టీటీడీ ఆస్థాన విద్యాంసుడుగా,కంచి కామకోటి పీఠం, అహోబిల మఠం

ఆస్థాన సంగీత విద్వాంసుడుగా సేవలు అందించారు. గత శుక్రవారం నాడే ఆయన యాదగిరిగుట్టలో తన ప్రదర్శనతో

ఆహుతులను అలరించారు. ఇంతలోనే ఆయన మరణ వార్త తెలియడంతో సంగీతప్రియులు విచారం వ్యక్తంచేస్తున్నారు. శ్రీవారి సేవకే జీవితం అంకితం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి వాస్తవ్యుడైన

గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ తిరుపతిలో స్థిరపడి అన్నమయ్య అంశగా ప్రశంసలు అందుకున్నారు. 1970లలో టీటీడీ అన్నమయ్య ప్రాజెక్ట్ గాయకుడిగా చేరిన గరిమెళ్ల 2006లో ఉద్యోగ విరమణ పొందారు. అన్నమయ్య కీర్తనలను ఆలపించడం, స్వరపరచడం, రికార్డు చేయడం, పుస్తకాలు ప్రచురించడం ద్వారా తన జీవితాన్ని తిరుమల శ్రీవారి సేవకే అంకింత చేసుకున్న మహనీయుడు గరిమెళ్ల. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం సైతం లభించింది.

విద్వత్తుఉన్నా, శిఖరమంత ప్రతిభ పుక్కిట పట్టినా

ఎంతో వినమ్రత గల వ్యక్తిగా, మానవీయ హృదయం ఉన్న సంగీత విద్యాంసుడిగాపేరొందారు. మహామహులు ఎందరో

శాస్త్రీయ కచేరీలు చేసినా తెలుగునాట సంకీర్తన

యజ్ఞ ప్రక్రియను తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత మాత్రం గరిమెళ్లకే దక్కుతుంది. భక్తి టీవీ హరి సంకీర్తన

ద్వారా ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు.

అరువేలకుపైగా కచేరీలు చేశారు. 300 కీర్తనలు నాన్ స్టాప్ గా పాడిన ఘనత సాధించారు. సిలికానాంధ్ర సంస్థ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన లక్ష గళార్చనలో ప్రధాన గాయకుడిగా మెప్పించారు. ఆ కార్యక్రమం గిన్నిస్బుక్ వరల్డ్ రికార్డల్లో చోటుదక్కించుకోవడం విశేషం.

ఆయన భక్తి గీతాలు రచించడంలోనూ దిట్ట. స్వయంగా హనుమాన్ భక్తుడైన ఆయన 21 ఆంజనేయ కృతులు రచించి స్వరపరచారు. వినాయకుడిపై కృతులు రచించారు. వెయ్యికిపైగా కీర్తనలు రచించి, స్వరపరచి

జన బాహుళ్యంలోకి తీసుకెళ్లడంలో విశేష కృషి చేశారు.

ఆయన స్వరపరచిన సంకీర్తనలను అనేక పుస్తకాలుగా టీటీడీ ప్రచురించింది. ఆయనకు భార్య రాధ, కుమారులు పవన కుమార్, అనిల్కుమార్ కూడా శ్రీవేంకటేశ్వరస్వామికి అంకితమై సేవలు అందిస్తున్నారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తికి శిష్యుడు,

ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్ జానకికి మేనల్లుడు కావడం మరో విశేషం. సినిమా అవకాశాలు వచ్చినా శాస్త్రీయ

సంగీతానికి, స్వామి వారి సేవకు అంకితమై జీవించారు. గరిమెళ్ల మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు పలువురు ప్రము

ఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.


Saturday, February 8, 2025

(5) గాలికి లోటున్నదా?

 (5) గాలికి లోటున్నదా?

సన్యసించాలనే తీవ్ర వైరాగ్యం గల వారికి కూడా సన్యసించే సమయంలో

తెలుస్తుంది సన్యసించడ మనేది అంత తేలికైన కార్యం కాదని. ఆ విషయంలో నేను

విలక్షణంగా లేను,

ముప్పై ఆరు సంవత్సరాలు ఉమ్మడి కుటుంబంలో కుటుంబం లేని సభ్యుణ్ణిగా

కొనసాగాను. క్షణంలో ఏకాకి నయ్యాను. ఆ క్షణంలో ఏదో అనిపించింది. కొన్ని

నిమిషాలు అభద్రతా భావం చోటు చేసుకుంది. జ్వర మొస్తే, మందెవరిస్తారు? ఆహారం

లభించక పోతే ఆకలిని భరించే దెలా? బట్టలు ఎవ్వరు ఇవ్వకుంటే తుండుగుడ్డ

చుట్టుకొని తిరగ గలనా? ఇలాంటి ప్రశ్నలు నా మనస్సును ముసురు కున్నది మాత్రం

వాస్తవం. అంతా కొన్ని నిముషాలే.

విశ్వనాథ స్వామి ఆలయంలో నిలబడలేక కూర్చుండి పోయాను. బుద్ధి

మొద్దుబారి నట్లైంది. ఈ అనుభవము కూడా నా జీవితంలో ఉంది.

అలా చూస్తూ ఉండగానే ధ్వజ స్తంభము దగ్గర నుండి ఒక కాకి పైకి ఎగిరింది.

నాకు కబురందించేందుకే ఎగిరిందేమో అని ఇప్పు డనిపిస్తుంది.

ఈ పక్షికి ఎవరున్నారు? దీని దేవూరు? ఇదెవరికి సంబంధించింది? దీనికి

జ్వర మొస్తే? ఆకలై ఆహారం లభించకపోతే? ఇలా ప్రశ్నలపై ప్రశ్నలు ఉరికురికి పడ్డాయి.

నా ప్రశ్నలకు సమాధానం లభించినట్టైంది. పక్షికి లేని అభద్రత నాకెందు కొచ్చింది?

తన రెక్కల్ని నమ్ముకొని పక్షి అంత ఆనందంగా విహరించే టప్పుడు, భగవంతుణ్ణి

నమ్ముకున్న నేను ఆనందంగా సంచరించలేనా? అని ప్రశ్నించుకోగానే కూలబడ్డ నేను

లేచి నిలబడ్డాను. అంతే, ఆనాటి నుండి నేటి వరకు అలాంటి అభద్రత మళ్ళీ నా

జీవితంలో తలెత్త లేదు. పక్షి ఎగిరిన సన్నివేశాన్ని గుర్తు చేసుకొని వ్రాసిందే ఈ పాట.

పల్లవి:

గాలికి లోటున్నదా? ఏటికి పోటున్నదా?

మంచిని తెలిసి సమతను పిలిచే

మనిషికి కొర తున్నదా?

1. పువ్వుకు మనసున్నదా?

నవ్వుకు వయసున్నదా?

నువ్వు నే ననే భేదము చూసే

బ్రతుకుకు సొగసున్నదా?

2. పక్షికి ఊరున్నదా?

అక్షికి నోరున్నదా?

మచ్చిక తెలిసి మనుగడ నడిపే

కుక్షికి కరువున్నదా?

3. మబ్బు మెరయ కుండునా!

జల్లు కురియ కుండునా!

భక్తి ప్రేమలు మనసున నిలువగ

ముక్తి లభించ కుండునా? 

సమతను పిలిచే

మనిషికి కొర తున్నదా?


Friday, February 7, 2025

(4) బ్రతుకు బొమ్మలాట

 (4) బ్రతుకు బొమ్మలాట

అప్పుడు నాకు పదహారు సంవత్సరాలు. ఎస్.ఎస్.ఎల్.సి. చదువుతున్నాను.

మా తండ్రి మరణించాడు. మా అన్నగారికి ఇరవై ఆరు సంవత్సరాలు. ఆయన జీతమే

ఇక అందరికీ ఊపిరైంది. మా తమ్ముడికి ఆరు సంవత్సరాలు. ఇంకా అతణ్ణి బడికి

పంపలేదు. అకస్మాత్తుగా జరిగిన ఆ సంఘటన పసి హృదయాలపై పిడుగు పడినంత

పని చేసింది.

తండ్రి పార్థివ దేహం కాలుతూ ఉంటే సమీపంలో ఉండి చూశాను. కళ్ళ

ముందే బూడిదగా మారిన తండ్రి శవం నా మనస్సుపై చెదరని ముద్రను వేసింది.

ఏనాడైనా, ఎవరి శవమైనా శ్మశానంలో పిడికెడు బూడిదగా మారుతుందనే నగ్న సత్యాన్ని

కనీసం వల్లకాటిలో నైనా గుర్తిస్తారేమో అనే భావన తోనే హిందూ సంప్రదాయంలో

తండ్రి శవానికి కొడుకు చేత నిప్పు పెట్టిస్తారని ఈ రోజు వేదికలపై నేను పలికే

వాక్యానికి నాంది ఆ సన్నివేశమే.

ఆ తరువాత ఇరవై సంవత్సరాలు దొర్లిపోయాయి. నాకు ముప్పై ఆరు

సంవత్సరాలు. మా తల్లి గతించింది. తండ్రిని దహనం చేసినట్లు తల్లిని దహనం

చేయలేదు, మా వంశ సంప్రదాయానికి భిన్నంగా ఆమె పార్థివ దేహాన్ని పూడ్చి పెట్టడం.

జరిగింది.

కారణం ఏదో కాదు. అప్పట్లో మా ఊరిలో రామలింగ స్వామి ఆలయంలో

నేను ఉపన్యాసాలు చెబుతూ ఉంటే, వినే శ్రోతలలో ఆమె కూడా ఒకతె. ఆలయానికి

సమీపంలో, దారి ప్రక్కన ఆమె అంత్యక్రియలు జరగటం చేత, అలా చేయవలసి

వచ్చింది.

ఎవరి చేతుల్లో నేను ప్రేమగా పెరిగానో, ఆమె దేహంపై నేను మట్టి వేసినపుడు

తీవ్రంగా చలించి పోయాను. నదీస్నానం చేసి ఆలయంలో దర్శనం చేసుకొని తిరిగి

వస్తూ ఉంటే, నా మనస్సులో కొన్ని భావాలు వేగాన్ని పుంజుకున్నాయి.

ఇదే సత్యం, ఎవరి జీవితమైనా ఇంతే. తెచ్చుకున్నది మట్టే. తిరిగి ఇచ్చుకొనేదీ

మట్టే, ఇక మన ప్రయాణం మారాలి; అని నిశ్చయించుకున్నాను. అంతే. ఆరు నెలలు

తిరుగక ముందే మద్రాసు వెళ్ళి శ్రీశ్రీశ్రీ శుద్ధానంద భారతీ స్వాముల వారిని కలిసి

వారి ఆశీస్సులు తీసుకొని ఇల్లు వదిలిపెట్టి ఒంటరిగా ధవళేశ్వరం చేరి ఆశ్రమాన్ని

ప్రారంభించాను.

పూజ్యులు శ్రీ శుద్ధానంద భారతీ స్వాముల వారు నూట నాలుగు సంవత్సరాల

వయస్సులో స్వయంగా వచ్చి స్వహస్తాలతో ఆశ్రమాన్ని ప్రారంభించి ఆశీర్వదించారు.

'Sudha and Sundara shall be one in Krishna Consciousness' అని ఆ 

సందర్భం లోనే వేలాది శ్రోతల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు.

తండ్రి గారి కంటే తల్లి మీదనే నాకు ప్రేమ ఎక్కువగా ఉండేది. ఆమెపై మట్టి

వేసిన ఆ తుది సన్నివేశం స్మృతిలో మెదిలినపుడు వ్రాసిందే ఈ పాట.

పల్లవి:

బ్రతుకు బొమ్మలాట విధి నడిపే వింతలే

విను నా మాట ఇలలో ఆట

అనుపల్లవి:

ఇంతేనా జీవిత మంతేనా?

చింతేనా - జీవికి చింతేనా?

చరణములు:

1.దేవు డిచ్చింది మట్టి ఒక్కటేలే

కట్టు కున్నప్పుడే మేడ ఔతుందిలే

ఏదో ఓనాడు కూలిపోతుందిలే

చివరికి తన వారు వేసేది మట్టేలే

2.రాలేవి ఆకులు కూలేవి మాకులు

అన్నీ గారడీలు మిగిలేవి గాయాలు

గమనాన్ని మార్చుకో- గమ్యాన్ని చేరుకో

నీలో నీవు నిండుగా ఉండిపో!


Saturday, March 30, 2024

శ్రీమద్రామాయణము ప్రవచనము#swami_sundara_chaitanyananda&NAMASTHE TELANGANA & TELANGANAM 31 MAR 2024

https://telanaganam.blogspot.com/2024/03/namasthe-telangana-telanganam-31-mar.html